Saturday, June 07, 2014

Current poilitcal situation in AP - the way forward (25/10/2011)

గత రెండు సంవత్సరాలుగా  ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాలో సాగుతున్న ఉద్యమం, దానికి ప్రతిగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. సంక్షోభ నివారణకు, ప్రతిష్టంభన తొలగింపుకు రాజకీయ పార్టీల క్షమార్హం కాని నిర్లిప్తత, దాటవేత, నాన్చుడు ధోరణి, అశ్రద్ధ మొత్తం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పైనే ప్రజలకు నమ్మకం పోగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఏరాజకీయ పార్టీ కూడా రెండుప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే ఒక ఉమ్మడి, మధ్యే మార్గాన్ని ప్రతిపాదించి దానిపై విస్తృత స్థాయిలో అర్థవంతమైన చర్చలు జరిపి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనే ప్రయత్నం ఇప్పటికీ  చేయలేదు.

ఇకముందు చేస్తాయన్న సూచనలు కనిపించటం లేదు. ఒకే రాజకీయ పార్టీకి చెందిన భిన్న ప్రాంతాల నాయకులు ఒక అంశంపై  పరస్పర విరుద్ధమైన రాజకీయ ద్రోక్కోణాన్ని ప్రకటించటం, తమ సహచరులతో నిత్యం మాటల యుద్ధంజరుపుతుండడం స్వతంత్ర భారత చరిత్రలో బహుశా అత్యంత అరుదైన పరిణామం కావొచ్చు.

తెలంగాణా వాదానికి 60 ఏళ్ళ చరిత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు జరిగిన చరిత్రపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ వాదనలను అంగీకరించినా, విభేదించినా 53 సంవత్సరాలు గడచినా  రెండు ప్రాంతాల మధ్య పరస్పర నమ్మకం, గౌరవం, తెలుగు భాషా వ్యవహర్తల మధ్య ఐక్యతసిద్ధించలేదన్నది నిర్వివాదాంశం.

చిదంబరం డిసెంబరు ౯ ప్రకటనను  తెలంగాణా వాదులు తొంభైయ్యవ దశకం నుండి ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతూ వస్తున్నచర్చల ప్రక్రియకు తార్కిక ముగింపుగానే భావించారు. స్తబ్దంగా ఉన్న తెలంగాణా రాష్ట్ర  డిమాండును మళ్ళీ రాజేసింది కాంగ్రెస్ (ఇరు ప్రాంతాల నాయకులు 'సమైక్యంగా' ) నాయకులేనన్నది నిజం. రాజకీయ స్వప్రయోజనాలకు తెలంగాణా అంశాన్ని వాడుకున్నదీ నిజం. ఆ సందర్భంలో ఇప్పుడు కరడుగట్టిన సమైక్య వాదులుగా రూపాంతరం చెందిన నాయకులెవ్వరూ అభ్యంతరాలు చేప్పలేదన్నదీ నిజం. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన సీమాంధ్ర సంపన్న,రాజకీయ వర్గాలకు మింగుడు పడలేదు. జన సామాన్యానికి కూడా ఇది అనూహ్యంగానే ఉండింది. నిజానికి 2001 నుండి తెలంగాణా అంశంపై మాటల గారడీ చేస్తూ వస్తున్న కాగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజల అభ్యంతరాలను, ఆందోళనలను, అనుమానాలను, అపోహలను తెలుసుకొని, వాటిని నివృత్తి చేసే దిశగా అడుగులు వేయవలసింది. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు.

అదే సమయంలో తెలంగాణా ప్రాంతంలో టీఆర్ఎస్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరింత విస్త్రుతమయ్యింది, ఉద్ధ్రుతమయ్యింది. సమాంతరంగా అదే కాలంలో హైదరాబాదు, పరిసర ప్రాంతాలకు సీమాంధ్ర నుంచి వలసలు ఎక్కువయ్యి వారికి ఈ ప్రాంతంతో ఆర్ధిక, మానసిక బంధం ఏర్పడింది. విచిత్రంగా కనిపించే ఈ వైరుధ్యం రెండు ప్రాంతాల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉదాసీనత, మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, సీమాంధ్ర ప్రజల, నాయకుల ఆర్థిక ప్రయోజనాల మధ్య జరుగుతూ వస్తున్న ప్రచ్చన్న యుద్ధం డిసెంబరు తొమ్మిది ప్రకటన తర్వాత బహిరంగ యుద్ధమే అయ్యింది.

ఈ ప్రకటనతో ఒక్కసారిగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా నిట్టనిలువున చీలిపోయాయి. తెలంగాణా అంశంపై చర్చకు కనీసం ఒకే వేదిక మీద కూర్చునే పరిస్థితులుకూడా లేకపోవడం ఈ చీలికకు అద్దం పడుతుంది. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండటం  అభిలషణీయం. కానీ ఈ ప్రజాస్వామ్య వాతావరణం ఆయా పార్టీలకు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు అవరోధమైతే అది ఆ స్ఫూర్తికే వ్యతిరేకం. ఇటువంటి సమయంలో ఒక దూరదృష్టితో కూడిన విశాల మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకత్వం లోటు కారణంగా రాష్ట్రం అక్షరాలా అగ్ని  గుండమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తన అస్పష్ట  పదాలు, వాక్యాలు, ప్రకటనల ముసుగులో ఎటువైపు మొగ్గడం తనకు లాభాదాయకమో అటు మొగ్గే ప్రయత్నాలు చేసింది. చేస్తోంది.

రాజకీయాలంటే క్రికెట్ ఆటలా కాదు. క్రికెట్లో మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫలితం వస్తుంది. రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలను సమాయత్తపరచవలసి ఉంటుంది. కానీ నేడు తెలంగాణపై నిర్ణయం క్రికెట్ మ్యాచ్కంటే కూడా ఉత్కంఠ  రేకెత్తిస్తున్నది. క్రికెట్లో ఫలితమేమయినా అభిమానులు పెద్దగా చేయగలిగిందేమీ ఉండదు. అదేరాజకీయాల్లో తప్పుడు నిర్ణయాలకు ప్రజలు ప్రతిస్పందిస్తారు, నచ్చకపోతే ప్రతిఘటిస్తారు. కాంగ్రెస్ సాంకేతిక కారణాలు చూపి తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసోకోవచ్చు. కాని ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో తెలంగాణా భౌగోళిక పటంలో కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం భస్మాసుర హస్తంలాఆ పార్టీని వెన్నాడుతోంది.

తెలుగు దేశం పార్టీకి ఆ వెసులుబాటు కూడా లేదు. ఎందుకంటే  ౨౦౦౯ ఎన్నికల మానిఫెస్టోలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ సుముఖతను వ్యక్తం చేస్తూ అధికారంలోకి వచ్చాక దానికి అవసరమయ్యే అన్ని రాజకీయ, న్యాయ సంబంధ ప్రక్రియలను ప్రారంభిస్తామని ఆ పార్టీ విస్పష్టంగా ప్రకటించింది. ఓ రకంగా తెలుగుదేశం ఈ మానిఫెస్టో కాంగ్రెస్ డిసెంబరు తొమ్మిది ప్రకటనలాంటిదే.

అయితేరెండు పార్టీలూ తెలంగాణా విషయంలో మాట తప్పాయి. రెండు కళ్ళ సిద్ధాంతం, తటస్థ వైఖరి అని  టీడీపీ, విస్తృత స్థాయి చర్చలు, ఏకాభిప్రాయం పేరిట కాంగ్రెస్ ఒక అనైతిక రాజకీయ ఒరవడిని మొదలుపెట్టాయి. ఎందుకంటే తెలంగాణకు  అనుకూలమని చెప్పిన పార్టీలు మరో ప్రాంత ప్రజలు అందుకు ఒప్పుకోవడంలేదు  అని చెప్పి తటస్థ వైఖరి పేరుతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం ఇక్కడి ప్రజలను ఘోరంగా అవమానించడమే, మోసగించడమే! డిసెంబరు 9 ప్రకటనకు రెండ్రోజుల ముందు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒక్క సిపీఎం తప్పితే అన్ని పార్టీలు తెలంగాణా ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఎంఐఎం తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తానన్నది. ఈ నేపథ్యంలో డిసెంబరు తరవాత ఏ చర్చలు, అభిప్రాయ సేకరణ జరిగినా అవి ఈ సూత్రప్రాయ తెలంగాణా అనుకూల వైఖరికి కొనసాగింపుగానే ఉండాల్సింది.

అది జరగలేదు. పోనీ తెలంగాణా ప్రజలనయినా సమైక్య రాష్ట్రం కొనసాగడం వల్ల కలిగే ఉమ్మడి ప్రయోజనాలను వివరించడం ద్వారా ఒప్పించవలసింది. అదీ జరగలేదు. ఆ పరిస్థితీ కనిపించడం లేదు. గడచిన రెండు సంవత్సరాలలో ఏ ఒక్క నాయకుడూ తెలంగాణాలో సమైక్యవాదం వినిపించే సాహసం చేయలేదు. సీమాంధ్రలో కొంతవరకైనా రాష్ట్ర విభజన వాదం వినబడుతోంది. తెలంగాణకు అనుకూలమే అని ప్రకటించినా ఆ ప్రాంత నాయకులు గానీ, చంద్రబాబు నాయుడు గానీ ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులదీ అదే పరిస్థితి. కొద్దో గొప్పో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా, డిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవడం ద్వారా ఆ మేరకు అక్కడి ప్రజల విశ్వసనీయత పొందగలిగారు. ఇంతటి సంక్షిభిత, కల్లోల సమయంలో రాష్ట్ర ఏర్పాటు జరిగి యాభై ఐదు సంవత్సరాలు పూర్తయినా అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ఒక్క నాయకుడూ ఎదగలేక పోవడం బట్టి రాష్ట్రం ఏ పాటి సమైక్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం - ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ - ఏ నిర్ణయాన్నీ ప్రకటించకుండా రెండు ప్రాంతాలనూ నిరవధిక  అస్థిరతలోకి  నెట్టి వేసింది. తెలంగాణా ప్రాంతం దీనివల్ల మరింత ఎక్కువగా నష్టపోతోంది. హైదారబాదులోని సీమాంద్రులలో ఒకవైపు అభద్రతభావం పెరుగుతుంటే, తెలంగాణా ఉద్యమకారులలో శాంతియుత మార్గాలేవీ ఫలితమివ్వకపోవడంతో రోజు రోజుకీ అసహనం పెరుగుతోంది.  పర్యవసానంగా రాజకీయ వ్యవస్థ బాధ్యతలనూ పోలీసులే తీసుకొని అప్రకటిత ఆత్యయిక స్థితిని నెలకొల్పారు. రాజకీయ ప్రక్రియ ద్వారా, రాజకీయ పార్టీల తోడ్పాటుతో పరిష్కారమవ్వాల్సిన సమస్య ఇపుడొక శాంతి భద్రతల సమస్యగా చిత్రించబడుతోంది. ఈ పరిస్థితులు తెలంగాణా ప్రజల్లో రాజ్య వ్యతిరేక భావనను మరింత పెంచి తీవ్రవాద పునరుత్థానానికి బీజాలు  వేసే ప్రమాదం ఉంది. అట్లే, సీమాంధ్ర ప్రజలు కూడా తెలంగాణాలో నిత్యం ఒక అస్థిరత, అభద్రతాపూర్వక వాతావరణంలో గడపాల్సి వస్తోంది.


అందుకే కాంగ్రెస్ ఈ అస్థిరతకు, ప్రతిష్టంభనకు ముగింపు పలకాలి. సకల జనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన కదలిక మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. 'కాల పరిమితి చెప్పలేం', 'చర్చలు కొనసాగుతున్నాయి', 'సుదీర్ఘ కాలం కొనసాగుతున్నఉద్యమం','అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం అన్వేషిస్తున్నాం'  అనే మాటలు చర్విత చర్వణంగా ఆ పార్టీ పెద్దల నుండి వస్తున్నాయి. సకల జనుల సమ్మె వంటి విస్తృత ప్రజా మద్దతు, భాగస్వామ్యం ఉన్న ఉద్ధృత ఉద్యమానికి ఇంత నిర్లక్ష్యపూరిత  ప్రతిస్పందనకు కారణం అన్ని పార్టీలూ ప్రజల సమగ్ర, దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తమ రాజకీయ స్వప్రయోజనాలకే పెద్దపీట వెయ్యడమే. ఈ వైఖరి వల్ల ప్రజలు తమ ఆకాంక్షల వ్యక్తీకరణకు ప్రజాస్వామ్య, శాంతియుత మార్గాల పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.అట్లే పాలకులలో ప్రజా ఉద్యమాలను అణచివేత ద్వారా ఎదుర్కోవచ్చనే ఒక అప్రజాస్వామిక ధోరణీ పెరుగుతుంది. ఇది సామాజిక అశాంతికి దారి తీస్తుంది.

కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినత వరకు రెండు అతి పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి జగన్ అంశం అయితే, రెండవది తెలంగాణా అంశం. మొదటి అంశం వ్యక్తిగత ప్రయోజనాల నుంచి పుట్టి ప్రజా సమూహంలోకి వెళితే రెండవ అంశం ప్రజా సమూహం ఆకాంక్ష నుంచి పుట్టి వ్యక్తిగత ప్రయోజనాలకి దారి తీసింది. ఈ రెండిట్లో ఏదో ఒక అంశం 'సహజ మరణం' చెందుతుందని కాంగ్రెస్ ఆశించింది. ఎదురుచూసింది. అయితే ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. తెలంగాణా అంశంలో అనేక చిక్కులు ఉన్నందున సమాంతరంగా జగన్ అంశం ఆ పార్టీ దృష్టి పెట్టింది. జగన్ పై ఒత్తిడి పెంచి ఆ పార్టీని తిరిగి కాగ్రెస్ అనుకూల పక్షం గానో, లేక పూర్తిగా విలీనం చేసుకోవడం ద్వారానో ఈ అంశం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. నూటా డెబ్భై అయిదు అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలున్న సీమాంధ్ర ప్రాంతంలో తమ రాజకీయ ప్రయోజనాలను కాంగ్రెస్ విస్మరించడం ఆత్మహత్యా సదృశం. అందుకే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం ద్వారా కొంతవరకు మెరుగైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జగన్ అంశం కూడా ఒక కొలిక్కి వస్తే మరింత బలపడే అవకాశం ఉంటుంది. జగన్ అంశం తేలకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే నెమ్మదించిన జగన్ దూకుడు మళ్ళీ మొదలవుతుంది. సిబిఐ సోదాలు, అనంతపురం, కర్నూలుతో కలిపి 'రాయల తెలంగాణా' ఏర్పాటు ప్రతిపాదన  వెనక జగన్కున్న ప్రజాదరణను, ప్రజామోదాన్ని దెబ్బకొట్టాలన్న వ్యూహం ఉందనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే జాతీయ  స్థాయిలో ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ లాగా కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉంటాం కానీ బీజేపీకి దగ్గరయ్యే ఆలోచన లేదని జగన్ ప్రకటించడం కాంగ్రెస్కు సంతృప్తినిచ్చే విషయం. అయితే తెలంగాణా విషయంలో కాంగ్రెస్ తీసుకొనే వైఖరిని జగన్ పూర్తిగా సమర్థించే పరిస్థితి కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. ఇవన్నీ జరిగినా సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఎట్లా స్పందిస్తారో చెప్పలేం.


అయితే అద్వానీ 'జన చేతనా యాత్ర'తో తెలంగాణా అంశానికి జాతీయస్థాయిలో మరింత ప్రాముఖ్యతను తెచ్చారు. కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిస్తామని, లేదంటే అధికారంలోకి వచ్చాక తామే బిల్లు ప్రవేశపెడతామని బీజేపీ విస్పష్టంగా ప్రకటించింది. ఇది కాంగ్రెస్ను ఖచ్చితంగా ఇరకాటంలో పెడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా ౨౦౧౪ లోనో లేక అంతకుముందో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీ ఆర్ ఎస్ లాంటి పార్టీలు  తెలంగాణా వాదంతో బరిలోకి దిగుతాయి. అంటే ఇప్పుడప్పుడే ఈ అంశం ముగిసే అవకాశం కన్పించడం లేదు. దీనికి తోడు, సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే తెలంగాణపై ఘాటుగా మాట్లాడుతున్నారు. జూపల్లి కృష్ణా రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, ౧౦ మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించి ఈ రోజు వరకూకట్టుబడి ఉన్నారు. సకల జనుల సమ్మె ముగిసినా మరో రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని కొదండరాం చెబుతున్నారు. టీ ఆర్ ఎస్ కూడా నిరాహార దీక్షలతో నవంబరు ఒకటి నుండి మళ్ళీ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రకటించింది. తెలంగాణా మార్చ్కు ఏర్పాట్లు  జరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా అది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని అందరిలో ఒక ఆందోళన సహజంగానే ఉంది.


ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా బతకాలంటే,ఈ రాష్ట్రంలో మళ్ళీ శాంతియుత వాతావరణం నెలకొనాలంటే తెలంగాణకు అనుకూల వైఖరిని తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే ఆ పార్టీ పరిస్థితి రెంటి చెడ్డ రేవడవుతుంది. రెండు ప్రాంతాల్లో నష్టపోయే ప్రమాదముంది. రెండు రాష్ట్రాల మధ్య న్యాయ సంబంధ మైన వివాదాలను సుప్రీం కోర్టు ఎలా పరిష్కరిస్తుందో, రెండు ప్రాంతాల మధ్య రాజకీయ వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఇది రాజ్యాంగ నిర్దేశిత కర్తవ్యం. కాని ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోవాలని చిదంబరం వంటి పెద్దలు చెప్పడం అనైతికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఎందుకంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం గురించి ప్రస్తావించదు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని మాత్రం రాష్ట్రపతి నిర్ణయించిన సమయంలో వ్యక్తపరచాలి. ఆ అభిప్రాయాన్ని తిరస్కరించే అధికారం కేంద్రానికి ఉంది. అందుకు భిన్నంగా సమస్య పరిష్కార బాధ్యతను రాష్ట్రంలోని పార్టీలు, ప్రజలపైకి నెట్టడం వలన అపనమ్మకం, ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు, అభద్రతా భావం, అస్థిరత రాజ్యమేలుతున్నాయి. ఈ వాతావరణం రెండు ప్రాంతాల్లో  తీవ్రమైనవాదాలకు ఊతమిస్తాయి. ప్రజల మధ్య పూడ్చలేని అగాధాన్ని ఏర్పరుస్తాయి.


అయితే, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఇంకా సమస్య శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంత చీలిక వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని యధాతథ స్థితిలో ఉంచడం సాధ్యం కాదని శ్రీ కృష్ణ కమిటీ కూడా అభిప్రాయపడింది. అయితే కమిటీ ప్రతిపాదించిన రీజినల్ కమిటీ మార్గం సమస్యను పరిష్కరించే అవకాశం లేదు. అది పనిచేయని ఔషధాన్ని కాలం చెల్లిన తర్వాత మళ్ళీ ప్రయోగించడం అవుతుంది. రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్తీకృత సంఘం (SRC), హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో వ్యతిరేకత వుంది. ఈపరిస్థితులలో కాంగ్రెస్ దశాబ్ద కాలంగా అస్పష్టంగానైనా ప్రకటిస్తూ వస్తున్నతెలంగాణా అనుకూల వైఖరికి తుది రూపం ఇవ్వటమే సమస్యకు శాశ్వత పరిష్కారమవుతుంది.

రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపి ఆ పరిష్కారం పరిధిలో సీమాంధ్ర ప్రాంత న్యాయబద్ధమైన, సహేతుకమైన ఆందోళనలను, అభ్యంతరాలను, అనుమానాలను గుర్తించి, గౌరవించి వారిహక్కులను కాపాడే దిశగా స్పష్టమైన హామీలతో కూడిన ప్రకటన కేంద్రం చెయ్యాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన బలహీన వర్గాలకు రాజ్యాధికారం, వనరుల పంపిణీ, వినియోగంలో సమానత్వం, వికేంద్రీకరణ వలన పారదర్శక, వేగవంతమైన పాలనా, కొత్త రాజధాని కేంద్రంగా జరిగే సత్వర ఆర్థికాభివృద్ధి చిన్న రాష్ట్రాల వల్ల సాధ్యమవుతుందన్న అవగాహన పునాదిగా కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు.

No comments: